Encounter: వివాదాస్పదమవుతున్న ఎన్ కౌంటర్... తప్పుబడుతున్న పలువురు!

  • ఈ తెల్లవారుజామున ఎన్ కౌంటర్
  • పోలీసుల చర్యకు ప్రశంసలు, విమర్శలు
  • ఇది పద్ధతి కాదన్న కార్తీ చిదంబరం

హైదరాబాద్ లో ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చర్యను వేలాది మంది ప్రశంసిస్తుండగా, కొందరు ప్రముఖులు తప్పుబడుతున్నారు కూడా.

వెటర్నరీ డాక్టర్ దిశను హైదరాబాద్ శివార్లలో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన 10 రోజులకు వారి ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ పై దిశ తల్లిదండ్రులతో పాటు, నిర్భయ తల్లి, బాలీవుడ్, టాలీవుడ్ నటీ నటులు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇదే సమయంలో కొందరు పోలీసుల చర్యను తప్పుబడుతున్నారు. "అత్యాచారం, హత్య తీవ్రమైన నేరమే. చట్టపరంగానే నిందితులకు కఠిన శిక్ష పడాలి. ఎన్ కౌంటర్ వంటి శిక్షలు సమాజానికి చేటు చేస్తాయి. తక్షణ న్యాయం కోసం బాధితులు ఎదురు చూస్తుంటారని తెలుసు. కానీ, దానికి ఇది పద్ధతి కాదు" అని కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం వ్యాఖ్యానించారు.

సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ స్పందిస్తూ, "తుపాకి తూటల న్యాయం అవసరం లేదు. ఇది కచ్చితంగా హర్షించతగ్గ పరిణామం కాదు. మహిళలు, వారి రక్షణ పేరు చెప్పి ఇలా ఎన్ కౌంటర్లు చేయడం సమంజసం కాదు. ప్రతి ఎన్ కౌంటర్ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, విచారణ తప్పనిసరిగా జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ ఎన్ కౌంటర్ పై స్వతంత్ర కమిటీ విచారణ జరపాలి" అన్నారు.

More Telugu News