Disha: 'పోలీసులూ జై..' అన్న నినాదాలతో దద్దరిల్లుతున్న ఎన్ కౌంటర్ ప్రదేశం!

  • విషయం తెలుసుకుని తరలివస్తున్న వేలాది మంది
  • చటాన్ పల్లి వద్ద స్తంభించిన ట్రాఫిక్
  • అదనపు బలగాలను తరలించిన పోలీసులు

పక్కా ప్లాన్ వేసి, దిశపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను సజీవదహనం చేసిన నలుగురు నిందితులూ హతమయ్యారు. ఈ ఉదయం నిద్ర లేవగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినిపించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఎక్కడైతే దిశను కాల్చారో, సరిగ్గా అదే ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల వారు పెద్దఎత్తున ఘటనాస్థలికి వచ్చారు.

వందలాది మంది ఆ ప్రాంతంలో చేరి "పోలీసులూ జై", "జస్టిస్ ఫర్ దిశ", "సజ్జన్నార్ జిందాబాద్" అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు, తమ వాహనాలను సైతం బ్రిడ్జ్ వద్ద ఆపి ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను ఇప్పటికే తరలించిన అధికారులు, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే పనిలో పడ్డారు.

 ప్రజలు మాత్రం ఈ ఎన్ కౌంటర్ పై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడే వారికి ఇటువంటి శిక్షలే పడాలని, అప్పుడే మరొకరు ఇటువంటి దారుణాలకు పాల్పడాలన్న ఆలోచన కూడా చేయబోరని అంటున్నారు.

More Telugu News