Chandrababu: చంద్రన్న ప్రారంభించిన కియాకు మళ్లీ రిబ్బన్ కట్ చేయడానికి మీకు సిగ్గనిపించలేదా?: జగన్ పై లోకేశ్ ఫైర్

  • కియా మోటార్స్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం జగన్
  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
  • మళ్లీ మళ్లీ ప్రారంభోత్సవాలు అంటూ ఎద్దేవా

అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటైన కియా మోటార్స్ ప్లాంట్ ను ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. దీనిపై మాజీ మంత్రి నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రన్న ప్రారంభించిన కియా సంస్థకు మళ్లీ రిబ్బన్ కట్ చేయడానికి మీకు సిగ్గనిపించలేదా? అని ప్రశ్నించారు.

 "చంద్రబాబు తెచ్చిన కియాను మీ నాన్న మహామేత తెచ్చాడనడం ఎలా ఉందంటే, బాగా ముద్దొస్తున్నాడని పక్కింటి పిల్లాడికి మీ ఇంటి పేరు పెట్టుకున్నట్టుంది" అంటూ ఎద్దేవా చేశారు. కమిషన్ల కోసమే చంద్రబాబు కియా తెచ్చారని ఆరోపించిన జగన్, ఇప్పుడదే పరిశ్రమ ప్రారంభానికి ఎంత కమిషన్ తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు.

మీరు విపక్షంలో ఉన్నప్పుడు కియా దండగ అన్నారు, ఇప్పుడు మీరు సీఎం అయ్యేసరికి కియాతో పండుగ అయిందా? అంటూ విమర్శించారు. "టీడీపీ చేసిన అభివృద్ధికి పేర్లు మార్చడం, రంగులేయడం, ఒకసారి ప్రారంభమైన వాటిని మళ్లీ ప్రారంభించడం క్యా కియా జగన్ మోహన్ రెడ్డి సాబ్... మీ చేతకానితనం కారణంగా దేశమంతా ఏపీని చూసి నవ్వుతోంది" అంటూ లోకేశ్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

More Telugu News