Chidambaram: తాను 'ఉల్లి' తిననన్న నిర్మలా సీతారామన్ కు చురకంటించిన చిదంబరం

  • తమ ఇంట్లో ఉల్లిపాయలను అంతగా వాడబోమన్న సీతారామన్
  • మరేం తింటారని చిదంబరం ప్రశ్న
  • అవకాడో పండు తింటారా? అంటూ ఎద్దేవా

తమ ఇంట్లో ఉల్లిపాయలను అంతగా వాడబోమని, తాను ఉల్లిపాయలు పెద్దగా వాడని కుటుంబం నుంచి వచ్చానని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. ఈ రోజు ఆయన రాజ్యసభ సమావేశాల్లో పాల్గొనడానికి పార్లమెంటుకు వచ్చిన విషయం తెలిసిందే. రాజ్యసభ వాయిదా పడిన నేపథ్యంలో పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉల్లి ధరలపై నిర్మలా సీతారామన్ నిన్న చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

'తాను ఉల్లిపాయలు తినబోనని నిన్న ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు. మరి ఆమె ఏం తింటారు? అవకాడో పండు తింటారా?' అని చిదంబరం ఎద్దేవా చేశారు. కాగా, ఉల్లిధరలు పెరిగిపోవడంతో సామాన్యులు పడుతోన్న ఇబ్బందులు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు తెలియడం లేదని ఈ రోజు కూడా విపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు. ఉల్లి ధరల పెరుగుదలపై పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో చిదంబరం కూడా పాల్గొన్నారు.

More Telugu News