Court peon daughter became Judge: తండ్రి ఒకప్పుడు కోర్టు ప్యూన్.. కూతురు ఇప్పుడు న్యాయమూర్తిగా!

  • నా కల నెలవేరిందన్న బీహార్ మహిళ అర్చన
  • చిన్నప్పుడు నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకున్నా
  • రాష్ట్ర జుడీషియల్ సర్వీస్ పరీక్షలో విజయం 

ఉన్నత పదవులు పొందటానికి కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రులు చేస్తోన్న ఉద్యోగాలు, వయసు తదితరాలు లెక్కలోకి తీసుకోనవసరం లేదని ఓ మహిళ చాటింది. బీహార్ కు చెందిన అర్చన తన తండ్రి గౌరీ నందన్ కోర్టులో ప్యూన్ గా పనిచేసినప్పటికీ.. మొక్కవోని దీక్షతో చదివి బీహార్ జుడీషియల్ సర్వీస్ పరీక్షలో నెగ్గింది. త్వరలో ఆమె న్యాయూర్తిగా నియామకం కానుంది.

ఆ వివరాలలోకి వెళితే, బీహార్ కు చెందిన అర్చన తండ్రి గౌరీనందన్, సరన్ జిల్లా సోన్ పూర్ న్యాయస్థానంలో ప్యూన్ గా పనిచేసేవారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిన అర్చన ఒక్కో మెట్టు ఎక్కుతూ..  పట్టుదలతో న్యాయవిద్య అభ్యసించడమే కాక చిన్నప్పుడు తాను న్యాయమూర్తిని అవుతానని తన తండ్రితో అన్న మాటను ఇప్పుడు నిలబెట్టుకుంది.

అర్చన బీహార్ జుడీషియల్ సర్వీస్ పరీక్షలో రెండో ప్రయత్నంలోనే  విజయం సాధించింది. త్వరలోనే ఆమె న్యాయమూర్తిగా బాధ్యతలను చేపట్టనుంది. ‘మా నాన్న నా చిన్నతనంలో న్యాయమూర్తుల వద్ద పనిచేసేవారు. నేను ఎప్పటికైనా న్యాయమూర్తిని అవుతానని ఆయనకు మాటిచ్చాను. ఆయన మరణానంతరం చదువు కొనసాగించడం అంత సులభం కాలేదు. మా అమ్మ పరిస్థితులకు ఎదురొడ్డి నాకు అండగా నిలిచింది’ అని అర్చన తెలిపింది.

వివాహం అనంతరం బిడ్డకు తల్లయిన తనకు న్యాయమూర్తి కావాలన్న తన ఆశయాన్ని భర్త రాజీవ్ రంజన్ స్వాగతించాడని చెప్పింది. తన విజయాన్ని పాలుపంచుకోవడానికి తన తండ్రి ఈ లోకంలో లేకపోవడమే తనను వేధిస్తోందని అర్చన వాపోయింది.

More Telugu News