Karnataka: సినీ హాస్యనటుడు బ్రహ్మానందం బీజేపీలో చేరతారంటూ ప్రచారం!

  • ఈ నెల 5న కర్ణాటక ఉపఎన్నికలు
  • చిక్ బళ్లాపూర్ లో ప్రచారం చేసిన బ్రహ్మానందం
  • బీజేపీలో బ్రహ్మానందం చేరతారన్న ఊహాగానాలు

ప్రముఖ సినీ హాస్యనటుడు బ్రహ్మానందం రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ఉపఎన్నికల్లో ఓ బీజేపీ అభ్యర్థి తరఫున ఆయన ప్రచారం చేశారు. తెలుగువారు అధిక సంఖ్యలో నివసించే చిక్ బళ్లాపూర్ లో ప్రచారానికి వెళ్లిన ఆయనకు బ్రహ్మరథం పట్టారు. దీంతో, బ్రహ్మానందం త్వరలో బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

కాగా, కర్ణాటకలో ఈ నెల 5 ఉపఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సుధాకర్ గెలిచారు. అయితే, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడిన ఆయన బీజేపీలో చేరారు. చిక్ బళ్లాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సుధాకర్ తరఫున బ్రహ్మానందం ప్రచారం నిర్వహించారు. అయితే, ‘బీజేపీలో చేరతారా? అన్న విలేకరుల ప్రశ్నకు బ్రహ్మానందం సమాధానం దాటవేస్తున్నారు. సుధాకర్ తనకు మిత్రుడని, ఆయన గెలుపు కోసం ప్రచారం చేసినట్టు చెప్పారు.

More Telugu News