Kodali Nani: ‘జనసేన’ను బీజేపీలో విలీనం చేసేందుకు పవన్ కల్యాణ్ ఏర్పాట్లు చేసుకున్నట్టు కనిపిస్తోంది: మంత్రి కొడాలి నాని

  • కేంద్ర మంత్రి అమిత్ షాను పవన్ పొగుడుతున్నారు
  • బీజేపీలో విలీనం చేసే సంకేతాలిచ్చారు
  • మా ప్రభుత్వాన్ని గుర్తించడానికి పవన్ ఎవరు?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జనసేన’ను బీజేపీలో విలీనం చేసేందుకు పవన్ కల్యాణ్ భారీ ఏర్పాట్లు చేసుకున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పొగడడం, మద్దతు ఇవ్వడం ద్వారా జనసేనను బీజేపీలో విలీనం చేస్తామన్న సంకేతాలిచ్చారని అన్నారు. జనసేన పార్టీని విలీనం చేయమని గతంలో అమిత్ షా అడిగితే ‘చేయను’ అని పవన్ కల్యాణే బహిరంగంగా చెప్పారని కొడాలి నాని గుర్తుచేశారు. ఇప్పుడు.. అమిత్ షా లాంటి నాయకులు అవసరమని పవన్ చెబుతున్నాడంటే, జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడేమో తమకు తెలియదని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ‘తానా’ అంటే పవన్ కల్యాణ్ ‘తందానా’ అంటున్నారని, తమ ప్రభుత్వాన్ని గుర్తించడానికి పవన్ ఎవరు? ఆయన్ని ప్రజలే గుర్తించలేదని, అందుకే, పోటీ చేసిన రెండు చోట్లా ఓడించారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కాన్వాయ్ పై దాడి ఘటన గురించి ఆయన ప్రస్తావించారు. మోసపోయామన్న బాధతోనే రైతులు దాడి చేశారని అన్నారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలాడినా తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని చెప్పారు.

More Telugu News