Crime News: పిల్లలను చంపేసి.. ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న దంపతులు

  • ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఘటన
  • మరో మహిళ పరిస్థితి విషమం
  • ఆర్థిక ఇబ్బందులే కారణం

ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.. తమకు చావు తప్ప మరో పరిష్కారం లేదని భావించారు.. బాధతో బరువెక్కిన గుండెతో, పరిస్థితుల నుంచి తప్పించుకోలేక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు పిల్లలను చంపేసిన ఆ దంపతులు.. ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్, ఇందిరాపురంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ రోజు పోలీసులు వివరించారు.

ఆ దంపతులతో పాటు ఓ మహిళ కూడా ఎనిమిదో అంతస్తు నుంచి దూకేసిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. ఆ మహిళను అతడి రెండో భార్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా ఇంట్లో నిద్రిస్తోన్న తమ కుమారుడు, కూతురును ఆ దంపతులు చంపేశారని వివరించారు.

'ఆ వ్యక్తితో పాటు ఎనిమిదో అంతస్తు నుంచి దూకేసిన ఆ ఇద్దరు మహిళలు ఆయన భార్యలేనని దర్యాప్తులో తెలిసింది. మేము వారి ఫ్లాట్ కు వెళ్లి తలుపు తెరిచి చూశాం. వారి ఇద్దరు పిల్లలు విగతజీవులుగా కనపడ్డారు. ఆత్మహత్య లేఖ కనపడింది. ఆర్థిక కారణాలవల్లే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది' అని పోలీసులు తెలిపారు. అయితే, వారి పేర్లను వెల్లడించలేదు.

ఆ కుటుంబం ఇటీవలే ఆ ప్రాంతానికి వచ్చి నివసిస్తోందని స్థానికులు తెలిపారు. 'ఏదో చప్పుడు వినపడితే నేను బయటకు వచ్చి చూశాను. ముగ్గురు వ్యక్తులు నేలపై పడిపోయి ఉన్నారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాం' అని ఓ స్థానికుడు చెప్పారు.

More Telugu News