Maharashtra: చెంప ఛెళ్లుమనిపించిన బాయ్ ఫ్రెండ్... అక్కడే కుప్పకూలి మృతి చెందిన మహిళ!

  • ముంబయిలోని మాన్ ఖుర్ద్ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఘటన
  • శవపరీక్ష నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
  • బాయ్ ఫ్రెండ్ అరెస్ట్

అది మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని మాన్ ఖుర్ద్ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్న ఓ ప్రాంతం. సీతా ప్రధాన్ (35) అనే మహిళ ఓ వ్యక్తితో చనువుగా మాట్లాడుతోంది. అదే సమయానికి ఆమె బాయ్ ఫ్రెండ్ రాజు పూజారీ ఎల్లప్ప అక్కడికి వచ్చాడు. ఆమె వేరొక వ్యక్తితో మాట్లాడుతుండడం చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే సీతా ప్రధాన్ చెంపఛెళ్లుమనింపించాడు. అంతే, ఆ మహిళ అక్కడే కుప్పకూలిపోయింది.

వెంటనే ఆమెను ఘట్కోపర్ లోని రాజావాది ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. దీనిపై ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా మాన్ ఖుర్ద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె శవపరీక్ష నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనలో రాజుని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

More Telugu News