Telangana: అన్ని రకాల బస్సు చార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

  • ముగిసిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె
  • చార్జీల వడ్డన
  • పెంచిన చార్జీలు ఈ అర్ధరాత్రి నుంచి అమలు

దాదాపు ఎనిమిది వారాల పాటు సాగిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె ముగిసిన వెంటనే చార్జీల వడ్డన మొదలైంది. తెలంగాణ ఆర్టీసీలో అన్ని రకాల బస్సుల చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పల్లెవెలుగు, సెమీ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కనీస చార్జి రూ.10కి పెంచారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మినిమమ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.15కి పెంచారు. డీలక్స్ బస్సుల్లో కనీస చార్జి రూ.15 నుంచి రూ.20కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో కనీస చార్జి ఇకపై రూ.25 వసూలు చేస్తారు. రాజధాని, వజ్ర, గరుడ బస్సుల్లో మినిమమ్ చార్జీని రూ.35కి పెంచారు. అత్యధికంగా వెన్నెల ఏసీ స్లీపర్ బస్సుల్లో కనీస టికెట్ ధరను రూ.75గా నిర్ణయించారు.

స్టూడెంట్ పాసుల విషయంలోనూ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించినట్టు అర్థమవుతోంది. స్టూడెంట్ బస్ పాస్ ధర రూ.130 నుంచి రూ.165కి పెంచారు. సిటీ ఆర్డినరీ బస్ పాస్ చార్జీని రూ.770 నుంచి 950కి పెంచారు. మెట్రో బస్ పాస్ చార్జి రూ.880 నుంచి రూ.1070కి పెంచారు. మెట్రో డీలక్స్ బస్ పాస్ చార్జీని రూ.990 నుంచి రూ.1180కి పెంచారు. పెంచిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

More Telugu News