Pulwama: పుల్వామా తర్వాత ఉగ్రవాదులు ఢిల్లీనే టార్గెట్ చేశారు: ఎన్ఐఏ

  • ఫిబ్రవరిలో పుల్వామా దాడి
  • మార్చిలో ఢిల్లీలో ఓ ఉగ్రవాది అరెస్ట్
  • అతడిచ్చిన సమాచారంతో మరో ముగ్గురి పట్టివేత

భారత్ పై విషం వెళ్లగక్కే ఉగ్రవాద సంస్థల్లో జైషే మహ్మద్ ముందువరుసలో ఉంటుంది. పాకిస్థాన్ కేంద్ర స్థానంగా పనిచేసే ఈ ఉగ్ర సంస్థ ఫిబ్రవరిలో పుల్వామాలో దాడి చేసి భారత్ లో తీవ్ర కలకలం రేపింది. అయితే, ఆ దాడి తర్వాత జైషే మహ్మద్ ఉగ్రవాదులు దేశరాజధాని ఢిల్లీపై దాడులు చేయాలనుకున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెల్లడించింది. ఢిల్లీలో జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతాలైన మండీ హౌస్, దరియా గంజ్, కశ్మీరీ గేట్ తదితర ప్రాంతాల్లో పలు సార్లు రెక్కీ నిర్వహించారని ఎన్ఐఏ వివరించింది.

అయితే మార్చిలో సజ్జద్ ఖాన్ అనే ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేయగా, అతడిచ్చిన సమాచారంతో మరో ముగ్గుర్ని కూడా పట్టుకున్నారు. వారిపై ఎన్ఐఏ అధికారులు సెప్టెంబరులో చార్జిషీటు దాఖలు చేశారు. కాగా వారిలో ఒకరైన బిలాల్ అహ్మద్ ఆత్మాహుతి దాడికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. పుల్వామా ఉగ్రదాడి వీడియో చూసి ప్రభావితుడైన బిలాల్ తాను అమరుడయ్యేందుకు కూడా తెగించాడని ఎన్ఐఏ వర్గాలంటున్నాయి.

More Telugu News