cm: ఎన్నికల ముందు అందరికీ ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులు!: సీఎం జగన్ పై చంద్రబాబు పరోక్ష విమర్శలు

  • ఆరోజు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?
  • వైసీపీకి రంగుల పిచ్చి పరాకాష్ఠకు చేరింది
  • అన్న క్యాంటీన్ కు కూడా రంగులు కొట్టుకున్నారు!

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. కర్నూలులో టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘ఎన్నికల  ముందు అందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్నారు. పోతూ పోతూ.. అందరికీ ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు.. ఏం చెప్పాలి? ఆరోజు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. వైసీపీ రంగుల పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, పంచాయతీ బిల్డింగ్ లకు కూడా ఆ పార్టీ రంగులు వేసుకుంటున్నారని మండిపడ్డారు. జాతీయ జెండాకు, గాంధీ మహాత్ముడికి, దేవాలయాలకు కూడా వైసీపీ వాళ్లు రంగేస్తారట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘అన్న క్యాంటీన్ కు కూడా రంగులు కొట్టుకున్నారు ఫర్వాలేదు. ఈయన (జగన్) ఫొటో, ఈయన తండ్రి (వైఎస్ రాజశేఖర్ రెడ్డి) ఫొటో కూడా పెట్టుకున్నారు. అది కూడా మీ ఇష్టం. అన్న క్యాంటీన్ ను ఎందుకు రద్దు చేశారో చెప్పమని డిమాండ్ చేస్తున్నా’ అని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన ‘చంద్రన్న బీమా’ ఇప్పుడు ఇస్తున్నారా? పండగ కానుకలు ఇస్తున్నారా? సన్నబియ్యం ఇస్తామన్నారా? వాటి అడ్రసు కూడా లేదంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

More Telugu News