Gotabaya Rajapaksa: ఇండియా, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలకు ఒకటే చెబుతున్నా...!: శ్రీలంక అధ్యక్షుడు

  • మా దేశంలో పెట్టుబడి పెట్టండి
  • లేకపోతే ఆ పని చైనా చేస్తుంది
  • హంబన్ టోట పోర్టుకు సంబంధించి చైనాతో ఉన్న ఒప్పందాన్ని సమీక్షిస్తాం

తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఇండియా, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియాలతో పాటు ఇతర దేశాలను కోరుతున్నానని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అన్నారు. 'ది హిందూ' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, శ్రీలంకలో పెట్టుబడులు పెట్టాలని తమ దేశాలకు చెందిన కంపెనీలకు చెప్పాలని ఆయన సూచించారు. అప్పుడే తమ దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇది ఒక శ్రీలంక సమస్య మాత్రమే కాదని ఆసియాలోనే అనేక దేశాల సమస్య అని చెప్పారు. ఈ దేశాలు పెట్టుబడులు పెట్టకపోతే ఆ పని చైనా చేస్తుందని తెలిపారు. తద్వారా చైనా తన 'బెల్ట్ అండ్ రోడ్' కార్యక్రమాన్ని అన్ని దేశాలకు విస్తరింపజేస్తుందని చెప్పారు.

కొలంబోలోని హంబన్ టోట పోర్టుకు సంబంధించి చైనాతో ఉన్న ఒప్పందాన్ని తాము సమీక్షిస్తామని రాజపక్స తెలిపారు. హంబన్ టోట వంటి వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులపై శ్రీలంక నియంత్రణే ఉండాలని తాను భావిస్తున్నానని చెప్పారు. ఇలాంటి అత్యంత కీలకమైన ప్రాజెక్టులు ఇతరుల నియంత్రణలో ఉంటే రాబోయే తరాలకు అన్యాయం చేసినవారమవుతామని తెలిపారు.

పోర్టు నిర్మాణం కోసం చైనా నుంచి భారీ ఎత్తున అప్పులు తీసుకున్న శ్రీలంక... ఆ తర్వాత ఆ లోన్లను తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో, 2017లో ఆ పోర్టును తీవ్ర ఒత్తిడి మేరకు చైనాకు 99 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాల్సి వచ్చింది. చైనాతో తమకున్న బంధంపై పలు దేశాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయని... తమను తప్పుగా అర్థం చేసుకుంటున్నాయని రాజపక్స అన్నారు. చైనాతో తమకు కేవలం వ్యాపారపరమైన ఒప్పందాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

More Telugu News