Chandrababu: చంద్రబాబు,‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ కలిసి కుట్ర చేస్తున్నారు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫైర్

  •  రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటున్నారు
  • అన్యమత ప్రచారం జరుగుతోందన్నది దుష్ప్రచారం
  • కుట్రలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు, ఆయనకు వంత పాడుతూ, తొత్తుగా మారిన ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ చేస్తున్న దుష్ప్రచారానికి తెరదించే కార్యక్రమం చేపట్టేందుకు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

టీటీడీ వెబ్ సైట్ లేదా క్యాలెండర్ లో గానీ ఎక్కడైనా కానీ ‘ఏసు’ అనే పదం వుంటుందా? ఎందుకు పెడతాం? హిందూ ఆలయం ఇది? ఎవరు చేస్తారు అన్యమత ప్రచారం? ఎందుకు చేస్తారు? అంటూ నిప్పులు చెరిగారు. టీటీడీ వెబ్ సైట్ లో ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదని, దీనిపై ‘గూగుల్’ వివరణ అడుగుతామని చెప్పారు. టీటీడీ వెబ్ సైట్ లో దుష్ప్రచారం జరగకుండా వుండేందుకు సైబర్ క్రైమ్ విభాగాన్ని ఇవ్వాలని సీఎం జగన్ ను కోరనున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని చంద్రబాబునాయుడు, రాధాకృష్ణ కలిసి కుట్ర చేస్తున్నారని, దీనిపై దర్యాప్తు చేయించి, కుట్రలు చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై వేలెత్తి చూపేందుకు ఏ అంశాలూ లేవు కనుకనే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న వారిని ఆ దేవుడు కూడా క్షమించడని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News