Maharashtra: నేను ఫడ్నవీస్ తో స్నేహాన్ని కొనసాగిస్తాను.. ఇప్పటికీ హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉన్నాను: అసెంబ్లీలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు

  • నేను గత ప్రభుత్వాన్ని ఎన్నడూ మోసం చేయలేదు
  • నేను ఫడ్నవీస్ ను ప్రతిపక్ష నాయకుడని పిలవను
  • ఆయనను 'బాధ్యతాయుత నాయకుడు' అని పిలుస్తాను
  • నేను ఓ 'లక్కీ సీఎం'ను

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే అన్నారు. ఈ రోజు ఆయన మహారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఫడ్నవీస్ నవ్వుతూ విన్నారు. 'నేను ఫడ్నవీస్ తో ఎప్పటికీ స్నేహాన్ని కొనసాగిస్తాను. నేను ఇప్పటికీ హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉన్నాను. దీన్ని ఎన్నటికీ వీడను' అని తెలిపారు.

'గత ఐదేళ్లలో నేను ప్రభుత్వాన్ని ఎన్నడూ మోసం చేయలేదు. నేను ఫడ్నవీస్ ను ప్రతిపక్ష నాయకుడని పిలవను. ఆయనను బాధ్యతాయుత నాయకుడు అని పిలుస్తాను. మాతో ఆయన సఖ్యతతో వ్యవహరించినట్లయితే, ఇరు పార్టీల మధ్య చీలిక వచ్చేది కాదు' అని ఉద్ధవ్ థాకరే చెప్పారు.

'నేను ఓ లక్కీ సీఎంను.. ఎందుకంటే నన్ను వ్యతిరేకించిన వారు నాతో కలిసి ఉన్నారు. గతంలో నాతో కలిసి ఉన్నవారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రజల ఆశీస్సులు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. నేను అసెంబ్లీలోకి వస్తానని ఎన్నడూ ఎవరికీ చెప్పలేదు. అయినప్పటికీ ఇక్కడకు వచ్చాను' అని ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు.

More Telugu News