KCR: దహన సంస్కారాలకు ముందు చెట్టుతో వివాహం జరిపించడం మా ఆచారం.. కానీ, జరిపించలేకపోయాం: వెటర్నరీ వైద్యురాలి బంధువు

  • పెళ్లి కాని వారు చనిపోతే మా కులంలో ఇలా చేస్తాం
  • కఠినతర చట్టాలు తెచ్చినప్పటికీ దాడులు నిరోధించలేకపోతున్నారు
  • శంషాబాద్ ఘటనపై సీఎం కేసీఆర్ ఇప్పటికీ స్పందించలేదు 

వెటర్నరీ వైద్యురాలిని నలుగురు పోకిరీలు దారుణంగా అత్యాచారం చేసి, దహనం చేసిన విషయం తెలిసిందే. అంత్యక్రియల విషయంపై ఆమె బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు. పెళ్లి కాని వారు చనిపోతే తమ కులంలో దహన సంస్కారాలకు ముందు చెట్టుతో వివాహం జరిపించడం తమ ఆచారమని, కానీ, ఆమె పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో ఆచారాలు జరిపించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో మహిళల రక్షణకు కఠినతర చట్టాలు తెచ్చినప్పటికీ ఇటువంటి వాటిని నిరోధించలేకపోతున్నారని అన్నారు. ఈ లోపాలను సరిచేసి, దేశంలో అమ్మాయిలకు భద్రత ఉంటుందని తెలిసేలా చేయాలని ఆయన కోరారు. ఘటనపై సీఎం కేసీఆర్ ఇప్పటికీ స్పందించలేదని, సంతాపం కూడా తెలియజేయలేదని ఆయన వాపోయారు. ఆమెకు జంతువులంటే చాలా ఇష్టమని, అందుకే  వెటర్నరీ వైద్యురాలయిందని చెప్పారు. ఆమెకు ఆన్‌లైన్‌లో  కొత్త వంటకాలను చేయడం  వంటి అలవాట్లు కూడా ఉన్నాయని తెలిపారు.

More Telugu News