Brahmanandam: కర్ణాటకలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బ్రహ్మానందం ప్రచారం!

  • కర్ణాటకలో ముగింపు దశకు ప్రచారం
  • ఉద్ధృతంగా సాగుతున్న నేతల ప్రచారం
  • చిక్కబళ్లాపురలో బ్రహ్మానందం ప్రచారం

కర్ణాటక ఉప ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియడానికి మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉద్ధృతంగా నిర్వహిస్తున్నాయి. ముఖ్యమంత్రి యడియూరప్ప, మాజీ ప్రధాని దేవెగౌడ రోడ్ షోల్లో బిజీగా ఉన్నారు. ప్రముఖ టాలీవుడ్ కమేడియన్ బ్రహ్మానందం, బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. చిక్కబళ్లాపురలో రోడ్ షో నిర్వహించిన ఆయన, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. బ్రహ్మానందం వచ్చాడని తెలుసుకున్న ప్రజలు, ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడంతో సందడి వాతావరణం కనిపించింది.

ఇక బెంగళూరు యశ్వంతపుర నుంచి తమ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఎస్టీ సోమశేఖర్ తరఫున సీఎం యడియూరప్ప ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ, విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ సైతం, తమ స్థానాలను నిలుపుకోవాలన్న లక్ష్యంతో శ్రమిస్తోంది. కాగవాడలో జేడీఎస్ అభ్యర్థికి మద్దతుగా మాజీ సీఎం కుమారస్వామి ప్రచారం నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్, జేడీఎస్ మధ్య, మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది. ముఖ్యంగా హొసకోటె, గోకాక్ హుణసూరు, కృష్ణరాజపేటె, విజయనగర, యశవంతపుర నియోజకవర్గాల్లో భారీ బెట్టింగ్‌ లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

More Telugu News