Mysore Student: కాలిఫోర్నియాలో మరో ఘోరం.. మైసూరు విద్యార్థిని కాల్చి చంపిన దుండగుడు

  • కాలిఫోర్నియా యూనివర్శిటీలో ఎంఎస్ చేస్తున్న అభిషేక్
  • మరో నాలుగు నెలల్లో పూర్తికానున్న చదువు
  • హోటల్ లో అభిషేక్ ను షూట్ చేసిన దుండగుడు

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మైసూరుకు చెందిన 25 ఏళ్ల అభిషేక్ సుధేశ్ ను ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపాడు. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది.

కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలో అభిషేక్ కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ చేస్తున్నాడు. ఒక హోటల్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఆ హోటల్ లోనే అభిషేక్ హత్యకు గురయ్యాడు. మరో నాలుగు నెలల్లో అతని చదువు పూర్తికాబోతున్న తరుణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అభిషేక్ చనిపోయినట్టు గురువారం రాత్రి 11.30 గంటలకు ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చింది. హోటల్ లో అభిషేక్ ను కాల్చి చంపారని మాత్రమే ఫోన్ లో చెప్పారని... ఇంతకు మించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అతని కుటుంబసభ్యులు చెప్పారు.

ఆ ప్రాంతంలో పెను తుపాను ప్రభావం చూపుతున్న తరుణంలో అతని డెడ్ బాడీని ఇండియాకు రప్పించడం కష్టమవుతోందని తెలిపారు. అమెరికా కాన్సులేట్, ఇండియన్ హై కమిషన్ ను తాము సంప్రదించినప్పటికీ... ఇప్పటి వరకు పూర్తి సమాచారం తమకు లభించలేదని... అభిషేక్ ను ఎందుకు చంపేశారో కూడా తెలియదని అన్నారు. మరోవైపు, అభిషేక్ కుటుంబసభ్యులు అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

More Telugu News