Tamil Nadu: ప్రశాంత్ కిశోర్ వైపు డీఎంకే చూపు.. 2021 ఎన్నికల కోసం మంతనాలు!

  • ఏపీలో వైసీపీ గెలుపును చూసి ఆసక్తి
  • అవకాశం చేజార్చుకోకూడదన్న ముందస్తు వ్యూహం
  • పీకేను స్టాలిన్ స్వయంగా ఆహ్వానించినట్టు సమాచారం

ప్రశాంత్ కిశోర్...!

పీకేగా రాజకీయవర్గాలకు చిరపరిచితుడైన ఈ బీహారీ ఎన్నికల వ్యూహకర్తల్లో ప్రముఖుడు. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయంలో కీలకపాత్ర పోషించిన పీకే సేవలను త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించుకోవాలని అక్కడి విపక్ష డీఎంకే పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం ఆ పార్టీ అధినేత స్టాలినే నేరుగా పీకేతో చర్చలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.


ఎన్నికలంటేనే వైకుంఠపాళీలాంటివి. అవకాశం ఊరించినా అనుకోని విధంగా చేజారవచ్చు. అనుకోని అంశాలు కలిసివస్తే అందలం దక్కవచ్చు. అందువల్ల ఏ రాజకీయ పార్టీకైనా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం తప్పనిసరి. తమిళనాడులో అధికారం ఊరిస్తుండడంతో అక్కడి విపక్ష డీఎంకే పార్టీ ఇప్పుడు ఇదే వ్యూహంతో వెళ్తోంది.


సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు దక్కించుకుని భవిష్యత్తులో ముఖ్యమంత్రి పీఠం తమదేనని ఊహల్లో విహరిస్తున్న డీఎం కేకు ఉపఎన్నికల్లో అక్కడి ఓటర్లు జెల్లకొట్టారు. దీంతో కంగుతిన్న పార్టీ పెద్దలు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదన్న వ్యూహంలో భాగంగానే ప్రశాంత్ కిశోర్ (పీకే) సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. 2021లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పీకే సలహాలు తీసుకోవాలని స్టాలిన్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

More Telugu News