MI: రూ.34,999కే 55 అంగుళాల 4కె టీవీని అందిస్తున్న షియోమీ!

  • కొత్త మోడల్ తీసుకువచ్చిన షియోమీ 
  • రూ.34,999కే 55 అంగుళాల టీవీ
  • ప్రముఖ బ్రాండ్లకు దీటుగా ఎంఐ టీవీ 4ఎక్స్ 55-2020 ఎడిషన్

ఒకప్పుడు సీఆర్టీ పిక్చర్ ట్యూబులున్న టెలివిజన్ లదే రాజ్యం అనుకుంటే, ఇప్పుడవన్నీ అవుట్ డేటెడ్ అయిపోయాయి. తాజాగా ఎల్ఈడీ టెలివిజన్ల హవా నడుస్తోంది. అది కూడా 4కె పిక్చర్ రిజల్యూషన్ టెక్నాలజీ ఉన్న టీవీ సెట్లకు మార్కెట్లో మాంచి డిమాండ్ కనిపిస్తోంది. ఆన్ లైన్ ఈకామర్స్ సైట్లలోనూ ఈ తరహా టీవీలు పండుగ సీజన్లలో తక్కువ ధరలకే లభ్యమవుతున్నాయి. అయితే, చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షియోమీ అతి చవకైన ధరలో 4కె పరిజ్ఞానంతో కూడిన ఎంఐ టీవీ 4ఎక్స్ 55-2020 ఎడిషన్ టీవీనీ మార్కెట్లోకి తీసుకువస్తోంది.

సాధారణంగా 40 అంగుళాల పైబడిన టీవీల ధరలు రూ.40 వేల పైనే ఉంటాయి. శాంసంగ్, సోనీ, పానాసోనిక్, ఎల్జీ వంటి ప్రముఖ బ్రాండ్లు 4కె టెక్నాలజీ టీవీల ధరలను కాస్త భారీ స్థాయిలోనే వసూలు చేస్తున్నాయి. కానీ షియోమీ నమ్మశక్యం కాని రీతిలో 55 అంగుళాల భారీ స్క్రీన్ తో కూడిన కొత్త మోడల్ ను రూ.34,999 కే అందిస్తోంది.

అంతేకాదు, జనవరి 31 లోపు కొనుగోలు చేసినవారికి టీవీతో పాటు తక్కువ ధరకే ఎయిర్ టెల్ డీటీహెచ్ కనెక్షన్ కూడా ఇస్తోంది. వినియోగదారులు నాలుగు నెలల పాటు ఉచితంగా ప్రసారాలు అందుకోవచ్చు. ఎంఐ వెబ్ సైట్ లోనూ, అమెజాన్ పోర్టల్ లోనూ ఈ సరికొత్త మోడల్ టీవీ డిసెంబరు 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది.

More Telugu News