Andhra Pradesh: మంత్రిగారి పీఏనంటూ మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

  • మేకపాటి గౌతమ్ రెడ్డి పీఏనంటూ మోసాలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
  • నిందితుడిపై పీడీ యాక్ట్

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పీఏనంటూ ప్రజలను మోసం చేస్తున్న వంశీకృష్ణారెడ్డి అనే వ్యక్తిని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. నిందితుడు నెల్లూరు జిల్లా గూడూరు మండలానికి చెందినవాడు. ఆరేళ్ల కిందట యాంటీ రేడియేషన్ చిప్ వ్యాపారం చేసి తీవ్రంగా దెబ్బతిన్నాడు. ఆర్థికంగా ఎంతో నష్టపోయిన వంశీకృష్ణారెడ్డి అక్కడి నుంచి కొత్త పంథాలోకి మళ్లాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలు తెలుసంటూ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేవాడు.

తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి గౌతమ్ రెడ్డి పేరు చెప్పుకుంటూ మోసాలకు తెరలేపాడు. తాను గౌతమ్ రెడ్డి పీఏనని అనేక మంది అమాయకులను బురిడీ కొట్టించాడు. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు వంశీకృష్ణారెడ్డిని వనంతోపు సెంటర్ లో అరెస్ట్ చేశారు.

More Telugu News