Chandrababu: చంద్రబాబుగారి 'అవినీతి బంగారు బాతు' గొంతును కోశామే తప్ప మరోటి కాదు!: వైసీపీ నేత రోజా

  • బాబు అవినీతి సామ్రాజ్యం నిర్మించుకోవాలని అనుకున్నారు
  • బాబుకు బుద్ధి వచ్చేలా జగన్ చేశారే తప్ప మరోటి కాదు
  • ఏ మొహం పెట్టుకుని అమరావతిలో పర్యటిస్తున్నారు?

బంగారుబాతు అమరావతి గొంతును వైసీపీ కోసేసిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరచుగా చేసే వ్యాఖ్యలపై ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా ఘాటుగా స్పందించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘చంద్రబాబు  గారి అవినీతి బంగారు బాతు గొంతు కోశారే తప్ప మరొకటి కాదు. తన కుల పెద్దలు, బినామీలతో ఒక అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకుని, దానికి చక్రవర్తిలా వుండాలనుకున్న చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా సీఎం జగన్ చేశారే తప్ప మరోటి కాదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు హయాంలో రైతుల నుంచి ముప్పై వేల ఎకరాలకు పైగా తీసుకున్నారే తప్ప వారికి కౌలు ఇవ్వలేదని, వారికి ఇస్తామన్న ప్లాట్లనూ డెవలప్ చేయలేదని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని బాబు అమరావతిలో పర్యటిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తాడికొండ, మంగళగిరిలో చిత్తుగా టీడీపీ ఓడిపోయిదంటే దాని అర్థమేంటి? అమరావతిలో చంద్రబాబు ఏం చేయలేదనే కదా? అన్నారు రోజా. తాత్కాలిక భవనాల కోసం చదరపు అడుగుకే పది వేల రూపాయల చొప్పున మింగేసిన చంద్రబాబు, తన ఐదేళ్ల పాలనలో కనీసం ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్ భవన్ కట్టాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తన పాలనలో అమరావతిలో నిర్మాణాలకు చేసిన శంకుస్థాపనల్లో ఏ ఒక్క బిల్డింగూ పూర్తి కాలేదని విమర్శించారు.

More Telugu News