Chandrababu: చంద్రబాబు అమరావతి ఎందుకు వెళ్లారు?: ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా

  • బినామీల పేరిట వున్న ల్యాండ్ల సరిహద్దులు సరిగా వున్నాయో లేవో చూడడానికి వెళ్లారా?
  • అమరావతిలో ఎక్కడైనా శాశ్వత కట్టడాలు నిర్మించారా?
  • అమరావతిని భ్రమరావతిగా చూపించారు!

రాజధాని అమరావతిలో నేడు పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు కొన్ని చోట్ల చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా స్పందిస్తూ, 'చంద్రబాబు అమరావతి ఎందుకు వెళ్లారు? తన బినామీల పేర్లతో తీసుకున్న ల్యాండ్ల సరిహద్దులు సరిగా వున్నాయా? లేవా? అని చూడడానికి వెళ్లారా? లేక పేదల నుంచి లాక్కున్న అసైన్డ్ భూములు వున్నాయా? లేవా? అని చూసేందుకు వెళ్లారా?' అని ప్రశ్నించారు. అమరావతిలో ఎక్కడైనా శాశ్వత కట్టడాలు నిర్మించారా? భూములు ఇచ్చిన రైతులకు ఏమైనా న్యాయం చేశారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు హయాంలో అమరావతిని భ్రమరావతిగా చూపించారని, రాజధాని పేరుతో ఎల్లో మీడియాలో గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

More Telugu News