Maharashtra: సాయంత్రమే ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం.. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్న అజిత్ పవార్

  • స్పందించిన ఎన్సీపీ వర్గాలు
  • పదే పదే ఫోన్లు వస్తుండటంతో ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశారని వ్యాఖ్య
  • ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారని చెబుతోన్న ఎన్సీపీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు సాయంత్రం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఎవరితోనూ మాట్లాడకుండా తన సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. దీంతో ఆయనతో పార్టీ నేతలు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఎన్సీపీ నుంచి గెలిచిన అజిత్ పవార్ ఇటీవల బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసి, బలనిరూపణకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో రాజీనామా చేశారు. దీంతో  చివరికి మళ్లీ అజిత్ పవార్ సొంత గూటికే చేరారు.

ఉద్ధవ్ ప్రభుత్వంలో అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం జరిగింది. అయితే, ఆయన ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఎన్సీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై స్పందించిన ఎన్సీపీ వర్గాలు మీడియాతో మాట్లాడుతూ.. పదే పదే ఫోన్లు వస్తుండటంతో ఆయన తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశారని అంటున్నారు. ఈ రోజు సాయంత్రం జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు.

More Telugu News