Bhagya Raja: భాగ్యరాజాను చెప్పుతో కొట్టాలి: వాసిరెడ్డి పద్మ

  • మహిళలపై భాగ్యరాజా వ్యాఖ్యలను ఖండిస్తున్నా
  • ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలి
  • ఆయనపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వారే కారణమంటూ సీనియర్ సినీ నటుడు, దర్శకుడు భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు.

అత్యాచార ఘటనలపై దారుణ వ్యాఖ్యలు చేసిన భాగ్యరాజాను చెప్పుతో కొట్టాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల మహిళలపై దాడులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపించే సినీ రంగానికి చెందిన భాగ్యరాజా బాధ్యతారహితంగా మాట్లాడారని మండిపడ్డారు. మహిళలకు ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భాగ్యరాజాపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదే విషయంపై తమిళనాడు ప్రభుత్వానికి తాను లేఖ రాస్తానని చెప్పారు.

ఓ కార్యక్రమంలో భాగ్యరాజా మాట్లాడుతూ, వివాహేతర సంబంధాల కోసం ఈరోజుల్లో మహిళలు భర్తలు, పిల్లల్ని చంపేస్తున్నారని అన్నారు. సెల్ ఫోన్ల వల్ల మహిళలు చెడిపోతున్నారని.. రెండేసి సిమ్ కార్డులు వాడుతున్నారని చెప్పారు. వారిపై అత్యాచారాలు, వేధింపులకు ఇది కూడా ఒక కారణమని అన్నారు. పొల్లాచ్చి అత్యాచార ఘటనలో మగవాళ్ల తప్పు ఏమాత్రం లేదని భాగ్యరాజా చెప్పారు. ఆ అమ్మాయి అవకాశం ఇచ్చినందువల్లే రేప్ జరిగిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

More Telugu News