ajit pawar: ఎన్సీపీలోనే ఉన్నాను, ఎన్సీపీతోనే ఉంటాను: మీడియాపై అజిత్ పవార్ ఆగ్రహం

  • మీరు ఇప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నారా? అంటూ ఓ విలేకరి ప్రశ్న
  • 'ఎన్నిసార్లు చెప్పాలి' అంటూ అజిత్ ఆగ్రహం 
  • నన్ను ఎన్సీపీ నుంచి బహిష్కరించారని మీరెక్కడైనా విన్నారా? అని వ్యాఖ్య

మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ నేత అజిత్ పవార్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఎన్సీపీకి షాక్ ఇస్తూ అజిత్ పవార్ బీజేపీతో కలవడంతో ఆయనను ఆ పార్టీలోంచి తొలగిస్తారన్న ప్రచారం జరిగింది. ఇదే విషయంపై ఆయనను మీడియా ప్రశ్నించగా ఆయన కసురుకున్నారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అజిత్ పవార్ బయటకు వచ్చారు. మీరు ఇప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నారా? అంటూ ఓ విలేకరి అడిగాడు. 'ఎన్నిసార్లు చెప్పాలి, నేను ఇప్పటికే ఎన్సీపీలోనే ఉన్నాను, ఎన్సీపీతోనే ఉంటాను' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
'ఎన్సీపీ నుంచి నన్ను బహిష్కరించారని మీరెక్కడైనా విన్నారా? లేక చదివారా?' అని అజిత్ పవార్ ప్రశ్నించారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని చెప్పారు. కాగా, గతంలో ఎన్సీపీలో అజిత్ పవార్ కీలక నేతగా ఉండేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఆయనే డిప్యూటీ సీఎం అన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ఆ పార్టీలో ఆయన స్థానం ఏంటీ? అన్న ప్రశ్న ఎదురవుతోంది.

More Telugu News