Madhya Pradesh: ప్రియుడిని మర్చిపోలేకపోతున్న భార్య.. ఆమె మనసెరిగి విడాకులకు సిద్ధమైన భర్త!

  • మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఘటన
  • వివాహమై ఏడేళ్లైనా ఆమె కోసం ఎదురుచూస్తున్న ప్రియుడు
  • అతడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త

ఆమెకు వివాహమై ఏడేళ్లు అయింది. అయినా ఆమె ఏనాటికైనా తన వద్దకు వస్తుందన్న ఉద్దేశంతో మాజీ ప్రియుడు పెళ్లి చేసుకోకుండా ఎదురుచూస్తున్నాడు. భార్య మనసెరిగిన భర్త వారిద్దరినీ తిరిగి ఒక్కటి చేయాలని భావించాడు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది.

భోపాల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఓ ఫ్యాషన్ డిజైనర్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లికి ముందే యువతి మరో యువకుడిని ప్రేమించింది. విషయం తెలిసిన ఆమె తండ్రి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో బలవంతంగా వివాహం జరిపించాడు. తనకు పెళ్లైనా ప్రియుడు మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదని, తనను తప్ప మరొకరిని పెళ్లి చేసుకునేందుకు ఇష్టంగా లేడన్న విషయం ఆమెకు తెలిసింది. తనపై అతడికున్న ప్రేమ ఏపాటిదో ఆమెకు అర్థమైంది. దీంతో మనసు కరిగిపోయి అతడిని పెళ్లాడాలని నిర్ణయించుకుంది.

విషయం తెలిసిన భర్త షాకయ్యాడు. అలా కుదరదని తేల్చి చెప్పాడు. అయితే, ఆమె మాత్రం ప్రియుడితో వెళ్లేందుకే నిర్ణయించుకుందని తెలియడంతో మెత్తబడ్డాడు. ఈ మొత్తం విషయాలను కోర్టుకు తెలియజేస్తూ విడాకులు ఇప్పించాల్సిందిగా కోరాడు. పిల్లల బాధ్యతను తాను చూసుకుంటానని, విడాకులు ఇప్పించాలని వేడుకున్నాడు. విడాకులకు ఇద్దరి అంగీకారం ఉండడంతో మంజూరు చేసేందుకు కోర్టు అంగీకరించింది.

More Telugu News