Devineni Uma: మేం అడిగిన దానికి సమాధానం చెప్పలేని మంత్రి మైండ్ దొబ్బిందంటున్నాడు: దేవినేని ఉమ

  • వైసీపీ మంత్రులపై ఉమ ఫైర్
  • ఇదేనా మీ భాష అంటూ ఆగ్రహం
  • జగన్ ది పైశాచిక ఆనందమని వ్యాఖ్యలు

ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తమపై చేసిన విమర్శలకు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ వెంటనే స్పందించారు. టీడీపీ నేతలకు మైండ్ దొబ్బిందంటూ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఉమ తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తాము రూ.5500 కోట్లు ఖర్చు చేశామని, ఆ నిధులను కేంద్రం నుంచి వైసీపీ ప్రభుత్వం ఎందుకు తెచ్చుకోలేకపోతోంది? అని ఉమ నిలదీశారు. నిధులు తెచ్చుకోవడం చేతకాక, తిరిగి తమపైనే విమర్శలు చేస్తున్నారని, మైండ్ దొబ్బింది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి తమను మంత్రులతో తిట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఏం భాష ఇది... వైఎస్సార్ కాంగ్రెస్ భాష ఇదేనా...  టీటీడీ విషయంలో దారుణంగా మాట్లాడుతున్నారు. ఎవరికివ్వాలి డిక్లరేషన్ అంటున్నారు. బూతుల మంత్రి కొడాలి నాని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. వైసీపీ మంత్రులు అహంకారంతో కొట్టుకుంటున్నారు. వెంకటేశ్వరస్వామిని పట్టుకుని ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు. ఈ వ్యాఖ్యలకు నైతిక బాధ్యత తీసుకుని వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా ఇంకా ఎందుకు కులుకుతున్నారు?" అంటూ ఉమ నిప్పులు చెరిగారు.

More Telugu News