Kakinada: నా భార్యను నడిరోడ్డుపై ఉరితీయాల్సిందే... చిన్నారి దీప్తి తండ్రి ఆవేదన!

  • 22న అదృశ్యమైన దీప్తి
  • సవతి తల్లే హత్య చేసిందని తేల్చిన పోలీసులు
  • కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ

కన్న బిడ్డకు తల్లిగా ఉంటుందన్న ఆలోచనతో మరో వివాహం చేసుకుంటే, తనే బిడ్డను కబళించిందన్న విషయాన్ని తెలుసుకున్న ఆ తండ్రి ఆవేదన వర్ణనాతీతం. కాకినాడ సమీపంలో చిన్నారి దీప్తిని దారుణంగా హత్య చేసిన సవతి తల్లి శాంతికుమారిని నడిరోడ్డుపై ఉరితీయాలని అంటున్నాడు ఆమె భర్త సూరాడ సత్యశ్యామ్ కుమార్. తానెంతో ప్రేమగా చూసుకునే బిడ్డను కర్కశంగా హత్య చేసిన ఆమెకు కఠిన శిక్ష పడాల్సిందేనంటున్నాడు.

కాగా, ఈ నెల 22న దీప్తి చదువుతున్న స్కూల్ కు వెళ్లిన శాంతికుమారి, ఆమెను తీసుకుని వెళ్లి, మెడకు టవల్ చుట్టి, ఊపిరాడకుండా చేసి చంపేయడంతో పాటు, ఆపై మృతదేహాన్ని సంచీలో వేసుకుని ఇంద్రపాలెం వంతెనపై నుంచి ఉప్పుటేరులోకి విసిరేసిన సంగతి తెలిసిందే.

ఆపై పాప కనిపించడం లేదంటూ అందిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, శాంతికుమారే నిందితురాలని తేల్చారు. తనకు పుట్టిన కుమారుడిని సరిగ్గా చూసుకోని కారణంగానే, తాను ఈ పనికి ఒడిగట్టినట్టు ఆమె చెప్పింది. ఆమెను అరెస్ట్ చేసి రిమాండుకు పంపిన పోలీసులు, కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు.

ఇదిలావుండగా, శాంతి, గతంలో తన తల్లితో కలిసి కన్నతండ్రిని కూడా హత్య చేసినట్టు పోలీసుల విచారణలో బయటపడటం గమనార్హం. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

More Telugu News