YSRCP: బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కనిపించిన రఘురామకృష్ణంరాజు.. మళ్లీ మొదలైన అనుమానాలు!

  • లోక్‌సభలో మాతృభాషకు అనుకూలంగా మాట్లాడి జగన్‌కు ఆగ్రహం తెప్పించిన వైనం
  • విజయసాయికి చెప్పకుండా ఎవరినీ కలవొద్దని ఆదేశం
  • రెండు రోజులైనా కాకముందే మరోమారు బీజేపీ ఆఫీసులో ప్రత్యక్షం

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించి రెండు రోజులైనా గడవకముందే ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమై షాకిచ్చారు. దీంతో పార్టీ మార్పుపై మరోమారు ఊహాగానాలు ఊపందుకున్నాయి. లోక్‌సభలో తొలిరోజు మాతృభాషకు అనుకూలంగా మాట్లాడి ఏపీలోని సొంత ప్రభుత్వానికి షాకిచ్చారు. ఆ తర్వాత సెంట్రల్ హాల్లో రఘురామ కృష్ణంరాజును మోదీ ఆప్యాయంగా పలుకరించారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

దీనిని తీవ్రంగా పరిగణించిన జగన్.. ఎంపీని అమరావతికి పిలిపించుకుని వివరణ అడిగారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని సూచించారు. విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డిలకు చెప్పకుండా కేంద్రమంత్రులు, ప్రధానిని నేరుగా కలవొద్దని ఆదేశించారు. అలా ఆదేశించి రెండు రోజులైనా కాకముందే రఘురామ కృష్ణంరాజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. దాదాపు గంటకుపైగా ఆయన లోపలే ఉన్నారు. దీంతో లోపల ఆయన ఎవరిని కలిశారు? ఏ అంశంపై చర్చించారన్న ఉత్కంఠ నెలకొంది. ఆయన తీరుపై వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News