Narendra Modi: మోదీ మాటలపై జగన్, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో విందామని వేచిచూస్తున్నా: పవన్ కల్యాణ్

  • అమ్మ భాషను విస్మరిస్తే అభివృద్ధి అసాధ్యం అన్న మోదీ
  • మాతృ భాషలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటూ వ్యాఖ్య
  • ఈరోజు నుంచే మీ భాష, యాసను ఉపయోగించండి అంటూ పిలుపు

అమ్మ భాషను విస్మరిస్తే అభివృద్ధి అసాధ్యం అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నిన్న నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి కూడా మాతృ భాషల ప్రాధాన్యతను గుర్తించిందని ఆయన అన్నారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరంగా ప్రకటించిందని గుర్తు చేశారు. శతాబ్దాలుగా మన దేశంలో వందలాది భాషలు వికసించాయని... వీటన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఈరోజు నుంచే మీ భాష, మీ యాసను ఉపయోగించడం ప్రారంభించండని పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ, అంతర్జాతీయ భాషల సంవత్సరం సందర్భాన, మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించింది విన్న జగన్ రెడ్డిగారు, మిగతా వైసీపీ సమూహం ఎలా స్పందిస్తారో విందామని వేచి చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ప్రాథమిక విద్య స్థాయిలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలనుకున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికి ఇష్టమైన మీడియంలో వారు చదువుకునేలా విద్యార్థులకు వెసులుబాటు ఉండాలని ఆయన సూచిస్తున్నారు.

More Telugu News