Telangana: తెలంగాణలోనూ రాజకీయ సర్జికల్ స్ట్రైక్స్: బీజేపీ చీఫ్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

  • గోదావరిఖనిలో బీజేపీ కార్యకర్తల సమావేశం
  • బాహుబలినని చెప్పుకునే కేసీఆర్ చుట్టూ కట్టప్పలు
  • తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిన్న నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో తమ పార్టీ చేసినట్టుగానే తెలంగాణలోనూ రాజకీయ మెరుపు దాడి చేసే పరిస్థితి దగ్గర్లోనే ఉందని అన్నారు. తాను బాహుబలినని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని, కానీ తన చుట్టూ ఎంతమంది కట్టప్పలు ఉన్నారో ఓసారి చూసుకోవాలని హితవు పలికారు.

మహారాష్ట్రలో ఎవరికీ అంతచిక్కని విధంగా మోదీ, అమిత్‌షాలు దేవేంద్ర ఫడ్నవిస్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేశారని పేర్కొన్న లక్ష్మణ్.. త్వరలోనే తెలంగాణపైకి కూడా బీజేపీ రాజకీయ అణ్వస్త్రాన్ని వదులుతుందని అన్నారు. అధికారం కోసం అక్రమ కలయికకు సిద్ధమైన శివసేనకు మహారాష్ట్రలో తగిన గుణపాఠం జరిగిందన్నారు. ఆర్టీసీలానే సింగరేణిని కూడా ప్రైవేటు పరం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని అన్నారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం లేదని, వారికి అధికారం ఇచ్చినా అమ్ముడుపోతారన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని లక్ష్మణ్ విమర్శించారు.

More Telugu News