Ranga Reddy District: కీచకుడిగా మారిన ప్రధానోపాధ్యాయుడు.. విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారం

  • రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటన
  • 8వ తరగతి బాలికను బెదిరించి లొంగదీసుకున్న హెడ్మాస్టర్ 
  • సహకారం అందించిన భార్య

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలోని జానెట్ జార్జ్ మెమోరియల్ స్కూల్/వసతి గృహ ప్రధానోపాధ్యాయుడు ఓ బాలికపై దారుణానికి తెగబడ్డాడు. చదువుకోవాలంటే తాను చెప్పినట్టు చేయాల్సిందేనంటూ ఆమెను బెదిరించి లొంగదీసుకున్నాడు. బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అందుకు అతడి భార్య సహకరించడం గమనార్హం. బాలిక షీ టీంను ఆశ్రయించడంతో కీచకుడికి పోలీసులు అరదండాలు వేశారు.

పోలీసుల కథనం ప్రకారం..  యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ ఆఫ్ ఇండియా (యూసీసీఐ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్కూల్‌లో 24 మంది బాలికలు, 76 మంది బాలురు ఆశ్రయం పొందుతూ చదువుకుంటున్నారు. విజయవాడకు చెందిన కలవెంటి ప్రసాదరావు (51) ప్రధానోపాధ్యాయుడిగా, ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. ఈ క్రమంలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక (14)పై కన్నేసిన ప్రసాదరావు ఆమెను బెదిరించి వసతి గృహంలోనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసినప్పటికీ భార్య వారించకపోగా, అతడికి సహకారం అందించింది. దీంతో అతడు మరింతగా రెచ్చిపోయాడు. ఏడాదిపాటు బాలికపై అతడు అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోయింది.

ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో తన అమ్మమ్మ వద్దకు వెళ్లిపోయిన బాలిక.. ఇటీవల టీసీ కోసం స్కూలుకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు తనపై జరిపిన దాష్టీకంపై స్నేహితురాలికి చెప్పుకుని బావురుమంది. వారి సాయంతో షీటీం, ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు హెడ్మాస్టర్ ప్రసాదరావు, అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News