mydukuru: ప్రియుడితో కలిసి భర్తను వాహనంతో తొక్కించి హత్య.. మైదుకూరులో ఘటన

  • వివాహేతర సంబంధానికి అడ్డుగా భర్త
  • తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్
  • లక్ష రూపాయలకు సుపారి

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను వాహనంతో తొక్కించి హత్య చేసిందో ఇల్లాలు. కడప జిల్లా మైదుకూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా మహానంది మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన ముడావత్‌ తులసీనాయక్, సాలిబాయి భార్యాభర్తలు. వీరికి 17 ఏళ్ల క్రితం వివాహమైంది. నాలుగేళ్ల క్రితం కడప జిల్లా మన్యంవారిపల్లెకు చెందిన మూడె రెడ్డినాయక్‌‌తో సాలిబాయికి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది.

తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సాలిబాయి ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా భర్తను హతమార్చేందుకు వినోద్ కుమార్ నాయక్, విజయ్‌కుమార్, మునగపాటి జగన్నాథరాజులతో కలిసి లక్ష రూపాయలకు సుపారి కుదుర్చుకుని రూ.30 వేలను అడ్వాన్స్‌గా చెల్లించింది.

ప్రణాళికలో భాగంగా సాలిబాయికి ఇవ్వాల్సిన రూ.10 వేలు ఇస్తానని, వచ్చి తీసుకెళ్లాల్సిందిగా ఆమె భర్త తులసీనాయక్‌ను రెడ్డినాయక్ చింతకుంట పిలిపించాడు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. అనంతరం మద్యం బాటిల్‌తో తులసీనాయక్‌పై దాడిచేశారు. తేరుకున్న తులసీనాయక్ పారిపోయేందుకు ప్రయత్నించగా, తమ వద్ద ఉన్న స్కార్పియో వాహనంతో తొక్కించి చంపారు. అనంతరం శవాన్ని తీసుకెళ్లి  దువ్వూరు మండలం పెద్దజొన్నవరం మిట్ట వద్ద కల్వర్టు పక్కన పడేశారు.
 
కేసును తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో తన భర్త మరణానికి గ్రామానికి చెందిన దమన పెద్ద పుల్లయ్య కారణమని సాలిబాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఆమె ప్రవర్తనలో అనుమానాన్ని గమనించిన పోలీసులు ఆమె కాల్‌డేటాను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె రోజూ రెడ్డి నాయక్‌తో మాట్లాడుతున్నట్టు తేలడంతో తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో సాలిబాయి హత్యను తానే చేయించినట్టు అంగీకరించింది. నిన్న ఆమెతో పాటు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

More Telugu News