Bangladesh: ఆరు నెలలకు రూ.3 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం.. బంగ్లాదేశ్ బాలికతో విజయవాడలో వ్యభిచారం

  • బంగ్లాదేశ్ సరిహద్దు దాటించిన ఇద్దరు వ్యక్తులు
  • కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకొచ్చిన మరో ఇద్దరు
  • విజయవాడలో భారీగా దందా

నెలకు రూ.50 వేల చొప్పున ఆరు నెలలకు మూడు లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుని బంగ్లాదేశ్ బాలికతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా విజయవాడ పోలీసులకు చిక్కింది. పోలీసుల కథనం ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని జూత్‌పూర్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సరిహద్దులు దాటించి కోల్‌కతాకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి రాహుల్, ప్రియ కలసి బాలికను విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చారు. అనంతరం జనార్దన్ నాయుడు, ప్రియ కలిసి బాలికను హైదరాబాద్ నుంచి బస్సులో విజయవాడ పంపారు.

అమ్మాయిని విజయవాడలో రిసీవ్ చేసుకున్న రవి అనే వ్యక్తి ఈ నెల 15 నుంచి 17 వరకు ఆమెతో వ్యభిచారం చేయించాడు. 18న దేవినగర్‌కు చెందిన సూరవరపు మహేశ్ అనే వ్యక్తికి బాలికను అప్పగించాడు. అతడు కూర వెంకట వరప్రసాద్ రెడ్డి అనే మరో వ్యక్తితో కలిసి బాలికతో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టాడు. వారు ఉంటున్న ఇంటికి రోజూ జనం వచ్చిపోతుండడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిన్న వ్యభిచార గృహంపై దాడిచేశారు. బాధిత బాలికతోపాటు నిందితులు ప్రసాద్‌రెడ్డి, మహేశ్‌లను అరెస్ట్ చేశారు. బాలికకు వైద్య పరీక్షల అనంతరం జువైనెల్ హోంకు తరలించారు. ఈ సందర్భంగా బాలిక మాట్లాడుతూ.. తనకు పెళ్లైందని, మూడున్నర సంవత్సరాల బాబు కూడా ఉన్నాడని పేర్కొంది. కాగా, నిందితులు ఇద్దరికీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు..

More Telugu News