Madhya Pradesh: బ్యాంకు ఖాతాలోకి నెలనెలా వచ్చి పడుతున్న సొమ్ము.. మోదీ వేస్తున్నారని వాడేసిన వైనం.. తీరా అసలు విషయం తెలిసి షాక్!

  • మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా ఎస్‌బీఐలో ఘటన
  • ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో పొరపాటున ఒకే ఖాతా సంఖ్య
  • డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి

తన ఖాతాలోకి నెలనెలా డబ్బులు వచ్చిపడుతుంటే హామీ ఇచ్చిన ప్రకారం మోదీ వేస్తున్నారు కాబోలు అనుకున్నాడట. ఆ సొమ్ముతో తన అవసరాలు తీర్చుకున్నాడు. అయితే, ఆ తర్వాత అసలు విషయం తెలిసి అటు బ్యాంకు అధికారులు, ఇటు ఈ వ్యక్తి ఆశ్చర్యపోగా, మరో వ్యక్తి మాత్రం షాక్‌కు గురయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో జరిగిందీ ఘటన.

జిల్లాలోని రురై గ్రామానికి చెందిన హుకుమ్‌సింగ్, రోనీ గ్రామానికి చెందిన హుకుమ్‌సింగ్‌లు ఇద్దరూ భారతీయ స్టేట్‌బ్యాంకుకు చెందిన ఒకే శాఖలో ఖాతా తెరిచారు. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో బ్యాంకు అధికారులు పొరపాటున ఇద్దరికీ ఒకటే ఖాతా నంబరు కేటాయించారు.

ఈ క్రమంలో ఓ గ్రామానికి చెందిన హుకుమ్‌సింగ్ బ్యాంకులో దాచుకుంటున్న డబ్బులు మరో హుకుమ్‌సింగ్ ఖాతాలో జమ అవుతున్నాయి. తన ఖాతాలోకి వస్తున్న డబ్బును చూసిన హుకుమ్ సింగ్.. 2014 ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారని సంబరపడ్డాడు. ఎప్పటికప్పుడు ఆ డబ్బులు తీసుకుని తన అవసరాలకు ఉపయోగించుకున్నాడు. అలా ఆరు నెలల కాలంలో మొత్తం 89 వేల రూపాయలు డ్రా చేసుకున్నాడు.

ఇటీవల డబ్బులు అవసరమైన అసలు హుకుమ్‌సింగ్ డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా, అందులో రూ.35 వేలు మాత్రమే ఉండడంతో లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించాడు. అప్పటికి గానీ చేసిన పొరపాటును అధికారులు గుర్తించలేకపోయారు.

తప్పును గుర్తించిన అధికారులు డబ్బులు వాడుకున్న హుకుమ్‌సింగ్‌ను పిలిచి అసలు విషయం చెప్పి డబ్బుల కోసం ప్రశ్నించారు. దీంతో తనకేమీ తెలియదని చెప్పాడు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తానని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. అందులో భాగంగానే డబ్బులు పడుతున్నాయని భావించి వాడేసుకున్నానని చెప్పడంతో తెల్లబోవడం అధికారుల వంతైంది. అతడి అమాయకత్వాన్ని చూసి ఏం చేయాలో పాలుపోని అధికారులు తలలు పట్టుకున్నారు.

More Telugu News