Mahesh Babu: 'అల వైకుంఠపురములో' కంటే ఒకరోజు ముందుగానే 'సరిలేరు నీకెవ్వరు'!

  • సమస్యను పరిష్కరించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్
  • మహేశ్ చిత్రం జనవరి 11న రిలీజ్
  • జనవరి 12న ప్రేక్షకుల ముందుకు అల వైకుంఠపురములో

టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కోసం ఈసారి పెద్ద హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్ ల సినిమాలు సిద్ధమవుతున్నాయి. మహేశ్ నటించిన 'సరిలేరు నీకెవ్వరు', బన్నీ నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలు ప్రస్తుతం శరవేగంతో షూటింగ్ జరుపుకుంటున్నాయి. వాస్తవానికి ఈ రెండు సినిమాలు జనవరి 12న రిలీజ్ చేయాలని ఆయా చిత్రబృందాలు నిర్ణయించాయి. అయితే పెద్ద హీరోల సినిమాలు కావడంతో బిజినెస్ రీత్యా ఇదేమంత మంచి పరిణామం కాదని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకే రోజున రెండు పెద్ద చిత్రాలు వస్తే ఎవరికీ సరైన ఓపెనింగ్స్ రాకపోవచ్చని, ఇప్పటిరోజుల్లో ఓ చిత్రం ఆర్థిక భవిత ఓపెనింగ్స్ మీదే ఆధారపడి ఉందని అన్ని వైపుల నుంచి స్పందనలు రావడంతో యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ఏటీఎఫ్ పీజీ) చురుగ్గా స్పందించింది. 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' చిత్రబృందాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించింది.

ఈ క్రమంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ఒకరోజు ముందుగా అంటే జనవరి 11న రిలీజ్ అవుతుంది. ఆ మరుసటి రోజున జనవరి 12న 'అల.. వైకుంఠపురములో' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మేరకు రెండు చిత్రాల నిర్మాతలు అనిల్ సుంకర, చినబాబులను ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒప్పించింది. ఈ మేరకు గిల్డ్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.

More Telugu News