Chandrababu: మద్యంతో తిరుపతి లడ్డూను పోల్చినందుకు చంద్రబాబునాయుడిపై కేసు నమోదు!

  • మద్యం ధరలను పెంచినట్టే లడ్డూ ధరలను పెంచుతున్నారు 
  • మద్యానికి ప్రజలను దూరం చేస్తామంటూ తిరుమలకూ భక్తులను దూరం చేస్తున్నారు
  • చంద్రబాబు వ్యాఖ్యలపై తిరుపతిలో కేసు నమోదు

హిందువులు పరమ పవిత్రంగా స్వీకరించే తిరుమల లడ్డూను మద్యంతో పోల్చినందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మద్యం ధరలను పెంచినట్టుగానే, తిరుమల లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతున్నారని, పేదలకు లడ్డూను దూరం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. మద్యనిషేధం చేస్తామంటూ ధరలను పెంచుతున్నారని, అలాగే తిరుమలకు భక్తులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో లడ్డూ ధరలను, రూముల ధరలను పెంచుతున్నారని ఆయన అన్నారు. దీంతో ఆయనపై తిరుపతి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.

తిరుమలకు దర్శనానికి వెళుతున్న సమయంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వడం లేదని టీడీపీ తీవ్ర ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాజకీయ ఆరోపణలకు తిరుమల వెంకన్నను టార్గెట్ చేసుకోవడం ఏంటని మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఈ మాటల యుద్ధంలో బీజేపీ సైతం వచ్చి చేరింది. తిరుమలపై మంత్రి వ్యాఖ్యలకు సీఎం సమాధానం చెప్పాల్సిందేనని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. మొత్తం మీద ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నాయనే చెప్పాలి.

More Telugu News