Hyderabad: గుడిలోని అమ్మవారికి నమస్కరించి.. కిరీటం చోరీ చేసిన భక్తుడు

  • హైదరాబాద్ గన్‌ఫౌండ్రీలోని దుర్గాభవానీ ఆలయంలో ఘటన
  • సీసీటీవీ కెమెరాలో రికార్డు
  • 35 తులాల వెండితో చేసిన కిరీటం  

భక్తుడిలా ఆలయానికి వెళ్లిన చోరుడు.. అమ్మవారికి నమస్కరించి ఆమెకు అమర్చిన కిరీటాన్ని దర్జాగా తీసి సంచిలో వేసుకుని పరారయ్యాడు. హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీలోని దుర్గాభవానీ ఆలయంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పూజారి లేని ఈ ఆలయానికి ఉదయం, సాయంత్రం వేళ్లలో శివ అనే యువకుడు ఆలయాన్ని తెరవడం, మూయడం చేస్తుంటాడు. ఉదయం ఆరు గంటల సమయంలో రాజు మహారాజ్ అనే పూజారి ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజ చేసి వేరే ఆలయానికి వెళ్లిపోతాడు. తిరిగి సాయంత్రం ఆలయానికి వచ్చి మళ్లీ పూజలు చేస్తాడు.

బుధవారం సాయంత్రం 7:30 గంటల సమయంలో ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు.. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారి కుంకుమ బొట్టు తీసి పెట్టుకున్నాడు. అనంతరం చుట్టూ చూసి, ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత అమ్మవారికి తలపై ఉన్న వెండి కిరీటాన్ని తీసి సంచిలో వేసుకుని పరారయ్యాడు. ఆ తర్వాత ఆలయానికి వచ్చిన పూజారి కిరీటం చోరీ అయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిరీటాన్ని 35 కిలోల వెండితో చేసినట్టు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More Telugu News