ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. కాన్పు కోసం ఎమ్మెల్యే కూతురు 12 గంటలు ఎదురుచూపు

- మధ్యప్రదేశ్ లో ఘటన
- పరిస్థితిని మీడియాకు వివరించిన ఎమ్మెల్యే సీతారాం
- ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆగ్రహం
- చివరకు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లామని వివరణ
'ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారహితంగా వ్యవహరించారు. నవంబరు 18న ఉదయం 9 గంటలకు మా కూతురు ధోదిబాయి (26)ని కాన్పు కోసం ఆసుపత్రిలో చేర్చాం. అయితే, సాధారణ డెలివరీ సాధ్యం కాదని, సిజేరియన్ చేయాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. ఆసుపత్రిలో సిజేరియన్ చేయడానికి వైద్యుడు లేడని, కాసేపట్లో వస్తాడని చెప్పారు. అయితే, ఆ ఆసుపత్రిలోనే 12 గంటలు ఎదురు చూసినా వైద్యుడు రాలేదు' అని సీతారాం చెప్పారు.
'చివరకు మా అమ్మాయిని ఏదైనా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. ఆ తర్వాత కూడా అంబులెన్సు ఏర్పాటు చేయడంలో చాలా ఆలస్యం చేశారు' అని అన్నారు. 'చివరకు మేము 119 కిలోమీటర్ల దూరం ఉన్న శివపురిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ నా కూతురికి సాధారణ కాన్పు జరిగింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది' అని సీతారాం వివరించారు. తమను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఎదురు చూసేలా చేశారని షియోపూర్ ఆసుపత్రి సిబ్బందిపై ఆయన మండిపడ్డారు.