Krishnam Raju: అంతా బాగుంది.. తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన రెబల్ స్టార్ కృష్ణంరాజు

  • ఇటీవల ఆసుపత్రిలో చేరిన కృష్ణంరాజు
  • వైరల్ ఫీవర్ వచ్చిందని వెల్లడించిన రెబల్ స్టార్
  • ఇప్పుడు కోలుకున్నానని వ్యాఖ్య
  • మ్యారేజ్ డే సందర్భంగా ప్రత్యేక పూజలు

తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని, ఆ సమయంలో కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందని, ఇప్పుడు తాను కోలుకున్నానని రెబల్ స్టార్ కృష్ణంరాజు తెలిపారు. తన అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు కలత చెందారని, తానిప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని అన్నారు. నిన్న కృష్ణంరాజు, శ్యామలాదేవి దంపతుల వివాహ దినోత్సవం కాగా, హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో శత చండీ మహాయాగం నిర్వహించి, మహాలక్ష్మిదేవికి ప్రత్యేక పూజలు చేశారు.

ఆపై తనను కలిసిన మీడియాతో మాట్లాడిన కృష్ణంరాజు, జలుబు, దగ్గు, జ్వరం సాధారణంగా వచ్చేవేనని, తన అనారోగ్యంపై కొన్ని మీడియాలు తప్పుడు ప్రచారం చేశాయని ఆరోపించారు. ఏదైనా వార్త రాసే ముందు తనను ఓసారి సంప్రదించి ఉండాల్సిందని అన్నారు. గత నాలుగైదు రోజుల నుంచి ఫ్యాన్స్ ఫోన్‌ చేసి తన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని అన్నారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

More Telugu News