Facebook: పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ల కొత్త రూటు.. హత్య చేసి, విషయాన్ని ఫేస్‌బుక్‌లో పెడుతూ పేరు కోసం పాకులాట!

  • మణిదీప్ అనే వ్యక్తిని వెంబడించి చంపిన గ్యాంగ్‌స్టర్
  • అతడిని తానే చంపానంటూ ఫేస్‌బుక్‌లో వివరంగా పోస్టు
  • వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు

పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్లు కొత్త పంథా అవలంబిస్తున్నారు. హత్యలు చేసి, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెడుతూ పేరు సంపాదించుకునేందుకు పాకులాడుతున్నారు. మంగళవారం ఓ గ్యాంగ్‌స్టర్ ఇలానే చేశాడు. పండోరి గ్రామానికి చెందిన మణిదీప్‌సింగ్ స్కూటర్‌పై వెళ్తుండగా, హర్విందర్ సింగ్ అనే గ్యాంగ్‌స్టర్ అతడిని వెంబడించి తుపాకితో కాల్చి చంపాడు. అనంతరం ఆ హత్యను తానే చేశానని, మణిదీప్‌ను ఎనిమిదిసార్లు తుపాకితో కాల్చి చంపానంటూ గర్వంగా తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశాడు.

మణిదీప్‌ను హత్యచేసింది తానేనని, పాత కక్షల కారణంగా తమ కుటుంబ గౌరవం కోసం అతడిని హత్య చేశానని పేర్కొన్నాడు. మున్ముందు ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తే వంద రౌండ్లు అయినా కాల్పులు జరిపి చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశాడు. ఇలాంటి విషయాల్లో పోలీసులు అమాయకులపై కేసులు పెట్టకూడదని కూడా హర్విందర్ పేర్కొనడం గమనార్హం. ఫేస్‌బుక్ పోస్టు వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More Telugu News