Janasena: జనసేన ఆధ్వర్యంలో 'మన నుడి- మన నది' చేపడతాం: పవన్ కల్యాణ్

  • నదులను విషమయం చేసుకోవడం బాధాకరం
  • భాష లేనిదే సంస్కృతి లేదు
  • మాతృభాష పరిరక్షణ, నదుల సంరక్షణకు వినూత్న కార్యక్రమం 

మాతృభాషను, నదులను పరిరక్షించుకొనే దిశగా 'మన నుడి- మన నది' కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను విషమయం చేసుకోవడం బాధాకరమని, నది లేనిదే సంస్కృతి లేదని అన్నారు. నది నశించాక ఆ సంస్కృతి మిగలదని, ఇందుకు చరిత్రలో కావలసినన్ని రుజువులు ఉన్నాయని చెప్పారు.

‘నాగరికతకు అమ్మ ఒడి నుడి. భాష లేనిదే సంస్కృతి లేదు. మాతృభాష గతించాక సంస్కృతీ మిగలదు’ అని, మన మనుగడకు జీవనాధారమైన నదులను మనం చేతులారా విషమయం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మన భవితకు ప్రాణాధారమైన అమ్మ నుడికీ మనం అతివేగంగా దూరమవుతున్నామని, మాతృ భాష మూలాలను మనమే నరికేసుకుంటున్నామని అన్నారు.

మన నుడినీ, మన నదిని కాపాడుకోవాలని, అందుకే, విజ్ఞులు, మేధావులతో ఈ అంశంపై చర్చించినట్టు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలవారినీ భాగస్వాముల్ని చేసేలా మన నుడి-మన నది’ కార్యక్రమం చేపడుతున్నామని, ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

More Telugu News