Telangana: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారు: బీజేపీ నేత వివేక్

  • మంచిర్యాలలో గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న నేత
  • ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నియంతలా వ్యవహరిస్తున్నారు
  • భవిష్యత్తులో సింగరేణిపై అదే రీతిలో వ్యవహరిస్తారేమో..

అబద్ధాలకు మారుపేరుగా సీఎం కేసీఆర్ మారారని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. కాకా వెంకట స్వామి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తీసుకొచ్చారన్నారు. వివేక్ ఈరోజు మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లిలో తమ పార్టీ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు.

డబుల్ బెడ్ రూంలు కట్టిస్తానని హామీ ఇచ్చి వాటి నిర్మాణాలు పూర్తిచేయకుండా, వంద ఏళ్ల నుంచి కొనసాగుతున్న సెక్రటేరియట్ భవనాన్ని కూల్చివేస్తానని అంటున్నారని విమర్శించారు. కేసీఆర్ నియంతను తలపిస్తున్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులపై ప్రతాపం చూపిస్తున్న కేసీఆర్ భవిష్యత్తులో సింగరేణిపై అదేరీతిలో వ్యవహరిస్తాడని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా దళిత వ్యక్తిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు.

More Telugu News