Ap chief whip Srikanth Reddy: చంద్రబాబు అప్పుడు సోనియాను ఆశ్రయించారు.. ఇప్పుడు మోదీని ఆశ్రయిస్తున్నారు: ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

  • తెలంగాణలో టీడీపీ శకం ముగిసింది.. ఇక ఏపీలో కూడా కనుమరుగవుతుంది
  • చంద్రబాబు ఔట్ డేటెడ్ నేత.. లోకేశ్ అప్ డేట్ కాని నేత అంటూ విమర్శ
  • అరాచక శక్తులను ప్రోత్సహించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు

చంద్రబాబు నాయుడు రౌడీ షీటర్లను వెనకేసుకుని తిరుగుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,  అరాచక శక్తులను ప్రోత్సహించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. చింతమనేని దౌర్జన్యాలు చంద్రబాబు, యనమలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడితే మతానికి లింకు పెట్టడం సమంజసమేనా? అంటూ ప్రశ్నించారు. కేసులకు భయపడి మళ్లీ మోదీ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమయ్యారన్నారు.

గతంలో తన రాజకీయ అవసరాలకోసం సోనియా కాళ్లు పట్టుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో టీడీపీ శకం ముగిసిందని, ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ కనుమరుగవుతుందని అన్నారు. చంద్రబాబు నిజాయతీ పరుడైతే తనపై ఉన్న కేసులకు సంబంధించి తెచ్చుకున్న స్టే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఆయన జీవితమంతా స్టేలు తెచ్చుకోవడంతోనే సరిపోయిందని విమర్శించారు. చంద్రబాబు ఔట్ డేటెడ్ నేత అయితే, లోకేశ్ అప్ డేట్ కాని నేత అని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

More Telugu News