Leopard: ఏడేళ్ల బాలుడిని చంపిన చిరుతపులి... మేకను ఎరగా వేసి పట్టేసిన అధికారులు!

  • దుడ్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఘటన
  • గ్రామాలపైకి వచ్చి దాడులు చేస్తున్న చిరుత
  • బోనులో బంధించి అడవిలో వదిలిన అధికారులు

మనిషి రక్తాన్ని రుచి మరిగి, ఓ ఏడేళ్ల చిన్నారిని చంపేసిన చిరుతను అధికారులు బంధించారు. ఈ ఘటన దుడ్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (డీటీఆర్)లో జరిగింది. వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, డీటీఆర్ అధికారులు సంయుక్తంగా ఓ ఆపరేషన్ నిర్వహించి, ఓ మేకను ఎరగా వేసి, చిరుతను బంధించారు. గత కొంతకాలంగా లఖింపూర్ కేహ్రీ ప్రాంతంలో ఈ చిరుత పెంపుడు జంతువులను చంపుతోందని, చిన్నారిపై దాడి చేసి చంపేసిందని, దీంతో అధికారులు దీన్ని బంధించాలని నిర్ణయించారని డబ్ల్యూటీఐ ఉన్నతాధికారి డాక్టర్ దక్ష గాంగ్వార్ వెల్లడించారు.

చిరుత కోసం ఓ బోనును సిద్ధం చేసి, దానిలో మేకను ఉంచామని, మేక కోసం వచ్చిన చిరుత బోన్ లో చిక్కిన తరువాత, దానికి వైద్య పరీక్షలు జరిపి, అడవి మధ్యలో వదిలామని వెల్లడించారు. ఇది పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆడ చిరుతపులని తెలిపారు. ఇకపై ఈ చిరుత కదలికలను అధికారులు రాడార్ల సాయంతో అనునిత్యమూ గమనిస్తుంటారని అన్నారు. ఈ నెల 11న బెలగాడి గ్రామ శివార్లలో మనోజ్ కుమార్ అనే ఏడేళ్ల బాలుడిని ఈ చిరుత చంపేయగా, దీన్ని పట్టుకోవాలని ఆ ప్రాంతంలో ప్రజలు నిరసనలకు దిగారు.

More Telugu News