Tamilnadu: దళితుడితో ప్రేమలో పడిందని.. తమిళనాడులో కూతుర్ని సజీవ దహనం చేసిన తల్లి

  • నాగపట్టణం జిల్లా వాజ్మంగళం గ్రామంలో ఘటన
  • ప్రియుడితో  పారిపోవాలనుకున్న అమ్మాయి
  • ఆగ్రహంతో కిరోసిన్ పోసి నిప్పంటించిన తల్లి
  • అనంతరం ఆత్మహత్యాయత్నం

దళితుడితో తన కూతురు ప్రేమలో పడిందన్న ఆగ్రహంతో కూతురిని సజీవ దహనం చేసిందో తల్లి. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా వాజ్మంగళం గ్రామంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన కలకలం రేపుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉమా మహేశ్వరి, కన్నన్‌ దంపతుల కూతురు జనని (17) తమ గ్రామంలోని ఓ దళిత యువకుడిని ప్రేమిస్తోంది.

వచ్చే నెలలో జననికి 18 ఏళ్లు వస్తాయి. దీంతో అతడిని పెళ్లి చేసుకోవాలని ఆమె అనుకుంది. ఈ విషయం ఆమె తల్లి మహేశ్వరికి తెలిసింది. దీంతో ప్రియుడితో కలసి జనని పారిపోవాలనుకుంది. ఈ విషయం కూడా జనని తల్లి మహేశ్వరికి తెలియడంతో కూతురిని మందలించింది. దీంతో వారిద్దరూ వాగ్వివాదానికి దిగారు.

ఈ క్రమంలో జననిపై కిరోసిన్‌ పోసి సజీవ దహనం చేసి, ఆ తర్వాత తనపై కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది ఉమా మహేశ్వరి. ఈ ఘటనలో జనని ప్రాణాలు కోల్పోగా, మహేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

More Telugu News