Nara Lokesh: చెప్పేవాడికి వినేవాడు లోకువ అనడానికి వైఎస్ జగన్ గారే గొప్ప ఉదాహరణ: నారా లోకేశ్

  • ఇంగ్లీషు మీడియం అంశంపై స్పందించిన లోకేశ్
  • సీఎం జగన్ పై వ్యంగ్యం
  • మాయా టీవీ, దగా పేపర్ అంటూ విమర్శలు

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఇంగ్లీషు మీడియం అంశంపై స్పందించారు. విపక్షంలో ఉన్నప్పుడు తెలుగు కోసం ఆరాటపడి, అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియం కోసం పోరాటం చేస్తున్నారట అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. దీనికి సంబంధించి ఓ వీడియో క్లిప్పింగ్ ను కూడా లోకేశ్ తన ట్వీట్ కు జతచేశారు.

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాక్షి టీవీలో ఓ బాలిక తమకు ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పగా, ఇప్పుడు ఓ బాలిక తమకు ఇంగ్లీష్ మీడియం కావాలని చెబుతుండడాన్ని అదే సాక్షి టీవీలో చూపించడం వీడియోలో దర్శనమిచ్చింది. దీనిపై లోకేశ్ వ్యాఖ్యానిస్తూ, మాయా టీవీ, దగా పేపర్ లో జిమ్మిక్కులు చూస్తుంటే ఏదో ఒకరోజు దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చింది కూడా మహామేత అనేలా ఉన్నాడని ఎద్దేవా చేశారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అనడానికి వైఎస్ జగన్ గారే గొప్ప ఉదాహరణ అని వ్యంగ్యం ప్రదర్శించారు.

More Telugu News