Telugudesam: విద్యాశాఖ మంత్రిగా నాడు పడిన శ్రమకు తగిన ఫలితం లభించింది: గంటా శ్రీనివాసరావు

  • నీతి ఆయోగ్ విడుదల చేసిన పాఠశాల విద్యా ప్రామాణిక సూచిక 
  • 2015-16, 2016-17కు సంబంధించిన ర్యాంకింగ్స్ లో ఏపీ ఫస్ట్
  • శ్రమ ఎప్పుడూ వృథా కాదన్న గంటా

టీడీపీ హయాంలో విద్యా శాఖ మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాసరావు ఆ పార్టీని వీడతారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీలోకి గంటా వెళతారన్న వదంతులు ఊపందుకున్నాయి. ఇదిలాఉండగా, రాజకీయాలకు అతీతంగా గంటా చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా వుంది.

నాడు విద్యాశాఖ మంత్రిగా తాను ఎంతో కష్టపడ్డానని, తమ కృషికి తగిన ఫలితాలు లభించాయని చెబుతూ.. 2015-16, 2016-17కు సంబంధించి నీతి ఆయోగ్ విడుదల చేసిన పాఠశాల విద్యా ప్రామాణిక సూచికను పొందుపరిచారు. ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ అవుట్ కమ్స్ కేటగిరి ర్యాంకింగ్స్ కేటగిరీలో  పెద్ద రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా మొదటి మూడు ర్యాంక్ లలో నిలిచినట్టు ఈ పోస్ట్ లో నీతి ఆయోగ్ పేర్కొంది.

శ్రమ ఎప్పుడూ వృథా కాదని, తమ శ్రమకు తగ్గ ఫలితం వచ్చినందుకు ఆనందంగా ఉందని గంటా పేర్కొన్నారు. నాడు తనకు సహకరించిన విద్యా శాఖ కార్యదర్శి, హెచ్ ఓడీలు, అధికారులందరికీ, ఉపాధ్యాయులకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

More Telugu News