Hyderabad: భర్తకు గుండెపోటు.. అతడి కంటే ముందే చనిపోవాలని భార్య ఆత్మహత్య

  • హైదరాబాద్ రహమత్‌నగర్‌లో ఘటన
  • భర్తకు గుండెపోటు రావడంతో తీవ్ర మనస్తాపం
  • ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం

భర్తకు గుండెపోటు రావడంతో ఆందోళన చెందిన ఇల్లాలు అతడి కంటే ముందే చనిపోవాలని అనుకుంది. హైదరాబాద్‌లోని రహమత్‌నగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని నారాయణపేటకు చెందిన సింధూజ (25), రహమత్‌నగర్‌కు చెందిన శివకుమార్ భార్యాభర్తలు. వీరికి 13, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న శివకుమార్‌కు ఈ నెల 12న గుండెపోటు వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సింధూజ తీవ్ర మనస్తాపం చెందింది.

తల్లి రత్నాదేవికి ఫోన్ చేసి భర్తకంటే ముందు తానే చనిపోతానని ఏడ్చింది. దీంతో ధైర్యం చెప్పిన తల్లి.. అలాంటి పిచ్చిపనులు చేయొద్దని, అంతా కుదుటపడుతుందని నచ్చజెప్పింది. అయినప్పటికీ ఆందోళన నుంచి బయటపడని సింధూజ ఈ నెల 14న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సింధూజ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News